న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం సంయక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఐదు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. రైతుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడే అధీకృత సంస్థ ఇదేనని చెప్పారు. ఈ కమిటీలో బల్బీర్ సింగ్ రాజేవాల్, శివ కుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చారుణి, యుధ్వీర్ సింగ్, అశోక్ ధావలే సభ్యులుగా ఉంటారని అన్నారు. ఎస్కేఎం తదుపరి సమావేశం ఈ నెల 7న జరుగుతుందని వెల్లడించారు.
కాగా, గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలతోపాటు రాష్ట్రపతి కూడా ఇటీవల ఆమోదం తెలిపారు.
దీంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం కీలక సమావేశం నిర్వహించింది. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడంతోపాటు రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో తమ ఇళ్లకు తిరిగి వెళ్లకూడదని రైతు సంఘాల నాయకులు నిర్ణయించినట్లు రైతు నాయకుడు దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. రైతులపై ఉన్న అన్ని కేసులను వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళనను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపామన్నారు.