రాంచీ: కిడ్నాప్ అయిన ఆరు నెలల తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అస్థిపంజరాలను పోలీసులు కనుగొన్నారు. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంత్నగర్ ప్రాంతంలోని సిడ్మా గ్రామానికి చెందిన 60 ఏళ్ల జగదీష్ రజక్, 55 ఏళ్ల భార్య శారదా దేవి, వారి మనవడు 17 ఏళ్ల రాజ్ రజక్ మే నెలలో కిడ్నాప్ అయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. భూ వివాదం నేపథ్యంలో ముగ్గురి కుటుంబ సభ్యులను మరో కుటుంబానికి చెందిన వారు కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో గ్రామం నుంచి పారిపోయిన ప్రధాన నిందితుడు వికాష్ బెహ్రా, అతడి కుటుంబ సభ్యుల కోసం ఆరు నెలలుగా పోలీసులు వెతుకుతున్నారు. నిందితులంతా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మారుతున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
ఈ క్రమంలో వికాష్ బెహ్రా ఇద్దరు భార్యలైన 36 ఏళ్ల సుస్మిత, 23 ఏళ్ల పార్వతీతోపాటు 51 ఏళ్ల సికు, 32 ఏళ్ల సుశీల్ జముదాను గురువారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా జముదా, సికు నుంచి కీలక సమాచారం రాబట్టారు. కిడ్నాప్ చేసిన ముగ్గురిని హత్య చేసి ముఫాసిల్ ప్రాంతంలోని ఛోటా లగియా గ్రామంలో మృతదేహాలను పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు వికాష్ బెహ్రాతోపాటు మిగతా వారి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.