Skeleton | బెంగళూరు : ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఈ ఐదుగురు కూడా బంధువులకు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని కొనసాగించినట్లు తెలిసింది. అంతేకాకుండా అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు.
ఈ ఐదుగురు కూడా 2019, జులైలో చివరిసారిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఇక అప్పట్నుంచి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం ఆ ఇంటి తలుపులు విరిగిపోయినట్లు స్థానికులు చెప్పారు. కానీ పోలీసులకు సమాచారం అందించలేదు. అయితే ఇంట్లో దొంగతనం కూడా జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
స్థానికుల సమాచారంతో ఇవాళ ఉదయం ఆ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. రెండు అస్థిపంజరాలు నేలపై, మరో రెండు అస్థిపంజరాలను బెడ్పై గమనించారు. మరో గదిలో ఇంకో అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం అందించారు. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంటి చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభ్యమైన అస్థిపంజరాలను భార్యాభర్తలు, వారి కుమారుడు, కూతురు, మనుమడివిగా పోలీసులు అంచనా వేశారు.