చెన్నై: తమిళనాడు రాష్ట్రం, త్రిచి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిచి-సాలెం జాతీయరహదారిపై తిరువాసి సమీపంలో ముందు వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం త్రిచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు త్రిచి పోలీసులు తెలిపారు.