న్యూఢిల్లీ, మే 21: నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్నది. హిండెన్బర్గ్ నివేదిక విడుదలకు ముందే ఇది జరిగిందని వెల్లడించింది. జనవరి 24న హిండెన్బర్గ్ నివేదిక విడుదలకు ముందు అదానీ స్కిప్స్లో షార్ట్ పొజిషన్లు జరిగాయని, స్టాక్స్ కుప్పకూలిన తర్వాత లాభాలు నమోదయ్యాయని రిపోర్టులో తెలిపింది. తన సొంతం కాని స్టాక్స్ను అమ్మకానికి పెట్టడాన్ని షార్ట్ పొజిషన్ అంటారు.
రాబోయే రోజుల్లో స్టాక్స్ విలువ తగ్గుతుందనే విశ్వాసంతో ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఒకవేళ ధరలు తగ్గితే.. వారు తక్కువ ధరకు స్టాక్స్ను కొనుగోలు చేయవచ్చు, లాభాలు పొందవచ్చు. కాగా, అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ తీవ్ర ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లనే కాక అన్ని వర్గాలకు కుదిపేసింది. ఆ గ్రూప్ కార్పొరేట్ చరిత్రలోనే పలు తప్పిదాలకు పాల్పడిందని, స్టాక్ మ్యానిపులేషన్తో వాటి విలువ అమాంతం పెంచేసిందని, అలాగే అకౌంటింగ్లో పలు అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. తామెలాంటి అవకతవకలు జరపలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమపై అన్యాయంగా ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
అయితే తాము సంధించిన ప్రశ్నలకు అదానీ గ్రూప్ సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో అంశాల గురించి చెప్పిందని, తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, వారితో ఎలాంటి న్యాయపోరాటానికైనా సిద్ధమేనని హిండెన్బర్గ్ చాలెంజ్ చేయడంతో అదానీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ గ్రూపు స్టాక్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది. సంపన్నుల జాబితాలో ఆయన స్థానం పడిపోయింది. ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రోజుల తరబడి పార్లమెంట్ స్తంభించింది. అయినా దీనిపై మోదీ ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరించింది. పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆరోపణలపై దర్యాప్తు జరపాలని మార్చి 2న సుప్రీం కోర్టు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో విచారణ జరిపిన ఈ కమిటీ ఇటీవల సుప్రీంకు నివేదిక సమర్పించింది. అ సంస్థ నగదు వ్యవహారాల్లో అనుమానాస్పద అంశాలేవీ తమ దృష్టికి రాలేదని తెలిపింది. అయితే నాలుగు విదేశీ సంస్థలతో సహా ఆరు సంస్థలు అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఇందులో ఒకటి కార్పొరేట్, మరొకటి వ్యక్తిగత సంస్థ అని తెలిపింది. అయితే ఈ ఆరు సంస్థల పేర్లను వారు తమ నివేదికలో పొందుపర్చలేదు. ఈ ఆరు సంస్థలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. అయితే అదానీ వ్యవహారంతో ప్రభుత్వానికి చెందిన ఎల్ఐసీ భారీగా నష్టపోయినట్టు గుర్తించామని పేర్కొన్నది.