కోల్కతా: పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉప ఎన్నికలు జరుగనున్న భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ నియోజకవర్గాల్లో ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కోల్కతాలో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
దీనిపై పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీఎంసీ తీరుపై మా పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని, రాష్ట్రంలో కూడా తాము ఎన్నోసార్లు ఈసీ కలిశామని, కానీ ఈసీ మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పటికైనా ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.