Sitrang Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుఫాన్ స్థిరంగా కొనసాగుతున్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ సిత్రాంగ్ ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని, ప్రస్తుతం సాగర్ దీవికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. ఈ తుఫాన్ రాగల 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే సూచనలున్నట్లు అంచనా వేసింది.
రేపు ఉదయం బంగ్లాదేశ్లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్ వద్ద సిత్రాంగ్ తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా, ఆపై అల్పపీడనంగా బలహీనపడుతుందని పేర్కొన్నది. ‘సిత్రాంగ్’ తుఫాన్ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు తెలిపింది.
సిత్రాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్ తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన ఈ సిత్రాంగ్ తుఫాన్ కారణంగా పశ్చిమబెంగాల్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని స్పష్టంచేసింది.