న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను మరింత వేగవంతం చేసే దిశగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022-2023 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా మూడేండ్ల నుంచి కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి కుంటుపడిన నేపథ్యంలో దానికి జవసత్వాలు కల్పించడంతోపాటు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మరిన్ని కేటాయింపులు ఉండవచ్చని భావిస్తున్నారు. వేతన జీవులు, పారిశ్రామిక వర్గాలు అధిక ప్రయోజనాలు ఆశిస్తున్నప్పటికీ ఈసారి పెద్దగా తాయిలాలు ఉండకపోవచ్చని, రక్షణాత్మక ధోరణిలోనే బడ్జెట్ ఉండొచ్చని పేర్కొంటున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనుండగా, మొదటి దఫా సమావేశాలు ఫిబ్రవరి 11వరకు జరుగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ పద్ధతిలో (కాగిత రహితంగా) బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ అంచనాలు:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2 శాతం ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 8-8.5శాతం ఉండవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగానికి అధిక కేటాయింపులు ఉండవచ్చని భావిస్తున్నారు. జీడీపీలో మూడు శాతం వరకు ఆరోగ్య సంరక్షణకు కేటాయించవచ్చని అంచనా. పలువురు నిపుణులు సైతం దేశంలో వైద్యరంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచాలని సూచిస్తున్నారు. ఇక ఆదాయం పన్ను శ్లాబులు, రేట్లలో మార్పులు ఉండవచ్చని మధ్య తరగతి వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లకు, ఎగుమతులకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈవో) పేర్కొంది. దేశంలోని 700 జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో కొన్ని రాయితీలు ఉండవచ్చని ఫిన్టెక్ పరిశ్రమ ఆశిస్తున్నది. మార్కెట్ సెంటిమెంట్లకు ఊపునిచ్చే విధంగా బడ్జెట్ ఉండవచ్చని రియాలిటీ రంగం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. పరిశోధన, అభివృద్ధిని కొనసాగించేందుకు తమకు మరిన్ని రాయితీలు కల్పించాలని ఫార్మా పరిశ్రమ కోరుతున్నది.
ఆర్థిక అసమానతలు తొలగించాలి
దేశంలో ఆర్థిక అసమానతలను తొలగింపు, ఉద్యోగ అవకాశాల పెంపుపై బడ్జెట్ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు. దేశ పురోగతికి జీడీపీ వృద్ధిపైనే కేంద్రీకరించకుండా కిందిస్థాయి వర్గాల ఆదాయ పెంపుదలకు గల మార్గాలను అన్వేషించాలని పేర్కొంటున్నారు.