లక్నో : మదర్సాల్లో విద్యార్థులు, టీచర్లు గురువారం నుంచి విధిగా జాతీయ గీతం ఆలపించాలని యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లాసులు ప్రారంభమయ్యే ముందు తప్పనిసరిగా జాతీయ గీతం ఆలపించాలని పేర్కొంది.
యూపీ మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 24న యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలుపై మే 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 30 నుంచి మే 11 వరకూ రంజాన్ కారణంగా మదర్సాకు సెలవు ప్రకటించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మదర్సాల్లో మతపరమైన ప్రార్ధనలతో పాటు జనగణమన గీతాన్ని విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాడాల్సి ఉంటుంది. అన్ని గుర్తింపు పొందినచ ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.