ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏండ్ల లతా మంగేష్కర్.. జనవరి 8న కరోనా కరోనా బారిన పడ్డారు. దీంతో గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ కాండీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల చనిపోయారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
గాయనిగా ఏడు దశాబ్దాలకుపైగా అలరించిన లతా మంగేష్కర్.. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. గురువు అమాన్ అలీఖాన్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 1947లో తన 13 ఏండ్ల వయస్సులో ‘మజ్జూర్’ చిత్రం ద్వారా గాయనిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1949లో మహల్ సినిమాలోని ‘ఆయేగా ఆనే వాలా’ అనే పాటతో ఆమె గుర్తింపు పొందారు. 1948-78 మధ్య 30 వేకుపైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు.
అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీ, అందాజ్, బడీ బహెన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లో తన గాత్రంతో అభిమానులను మైమరిపింపజేశారు. మొత్తంగా 980 చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. తనకు మనుమరాలి వయస్సున్న యువ హీరోయిన్లకు కూడా లత పాటలు పాడారు.
భారత నైటింగెల్గా గుర్తింపు పొందిన ఆమె.. మొత్తం 170 మంది సంగీత దర్శకుల వద్ద 30 వేలకుపైగా పాటలు పాడారు. 36 దేశ, విదేశీ భాషల్లో తన అద్భుతమైన గాత్రం వినిపించారు. సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురష్కారాలు అందించింది. భారత సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.