రాయ్పూర్ : చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Chhattisgarh Polls) సీఎం భూపేష్ భఘేల్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా పోరాడుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే సీఎం రేసులో భూపేష్ భఘేల్ ముందువరసలో ఉంటారని ఆయన ఆదివారం పేర్కొన్నారు. భఘేల్ నేతృత్వంలోనే తాము ఎన్నికలకు వెళతామని, ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కెప్టెన్ను ఎందుకు మార్చాలని సింగ్ దేవ్ ప్రశ్నించారు.
90 మంది సభ్యులు కలిగిన చత్తీస్ఘఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 75 సీట్ల వరకూ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. గత నెలలో సింగ్ దేవ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టగా బాఘేల్తో తన విభేదాలు పాత విషయమని ఇప్పుడు కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చుతామని చెప్పారు.
సమిష్టి నిర్ణయాలతో చర్చలు, సంప్రదింపులతో ఏకాభిప్రాయం దిశగా తాము పనిచేస్తామని, పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడమే ఆశయంగా ముందుకెళతామని స్పష్టం చేశారు. తనకు రెండున్నరేండ్లు సీఎం పదవి దక్కకపోవడం పట్ల తానేమీ అసంతృప్తిగా లేనని, పదవులపై పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని అన్నారు. భూపేష్ భఘేల్ క్యాబినెట్లో తాను నెంబర్ టూగా ఉన్నానని గుర్తుచేశారు.
Read More :