గ్యాంగ్టక్: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్(CM Prem Singh Tamang) .. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కృష్ణ కుమారి రాయ్ కూడా పోటీ చేయనున్నారు. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్పై ఆమె పోటీ చేస్తున్నారు. నామ్చి-సింగితాంగ్ సీటు నుంచి కుమారి రాయ్ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిక్కింలో సిక్కిమ్ క్రాంతికారి మోర్చా పార్టీ ఆధ్వర్యంలో సర్కార్ నడుస్తున్నది. 32 అసెంబ్లీ స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న ఒక్క లోక్సభ స్థానం నుంచి ఎంపీ ఇంద్ర హంగ్ సుబ్బా పోటీ చేయనున్నారు. సోరెంగ్-చాకుంగ్, రినాక్ స్థానాల నుంచి సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేయనున్నారు. ఎస్కేఎం పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకర్ అరుణ్ కుమార్ ఉప్రేటి మీడియాకు వెల్లడించారు. అరితాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప్రేటి పోటీ చేయనున్నారు. ఎస్కేఎం పార్టీ 9 మంది మంత్రులకు టికెట్లు ఇచ్చింది, మరో ఇద్దర్ని డ్రాప్ చేసింది. సీఎం కుమారుడు ఆదిత్య గోలేను సోరెంగ్-చాకుంగ్ సీటు నుంచి తప్పించారు.