ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి. ఏక్నాథ్ షిండేకు చెందిన బాలాసాహెబ్ శివసేనకు రెండు కత్తులు, డాలుతో కూడిన గుర్తును ఈసీ కేటాయించింది. అయితే ఇది ఖల్సా పంత్కు సంబంధించిన మతపరమైన చిహ్నమని సిక్కు మతస్తులు అంటున్నారు. తమ మత గురువు శ్రీ గురు గోబింద్ సింగ్ కత్తీ, డాలును ఖల్సా పంత్ మతపరమైన చిహ్నంగా నిర్ణయించారని గురుద్వారా సచ్ఖండ్ బోర్డ్ మాజీ కార్యదర్శి రంజిత్ సింగ్ కంతేకర్ అన్నారు.
దీనిపై ఆయనతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఆ గుర్తును ఎవ్వరికీ కేటాయించ కూడదని కోరారు. తమ అభ్యర్థనను ఈసీ పట్టించుకోనట్లయితే కోర్టుకు వెళ్తామని వెల్లడించారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేనకు (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) ఈసీ కాగడా గుర్తును కేటాయించింది. దీనిపై సమతా పార్టీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.