Adar Poonawalla | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నా పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి నుంచి కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూణావాలా మీడియాతో మాట్లాడారు. ఐదు నుంచి ఆరు మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఏమీ తీవ్రంగా లేదని, తేలికపాటి వేరియంట్లు మాత్రమేనన్నారు. అయితే, ముందుజాగ్రత్తగా వృద్ధులు బూస్టర్ డోస్ తీసుకోవచ్చన్నారు.
అయితే, వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనేది వారి ఇష్టమన్నారు. ప్రస్తుతం ఆరు మిలియన్ల కోవోవాక్స్ కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో అదే మొత్తం కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సైతం ఉత్పత్తి చేస్తామని పూణావాలా తెలిపారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో దేశంలో 12,193 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో వైపు ముంబయిలో ఎక్స్బీబీ.1.16 వేరియంట్ ప్రభావం చూపుతున్నది. అదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.