TMC : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ నాయకత్వంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆ ఇద్దరినీ టీఎంసీ సస్పెండ్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యేలు సందీపన్ సాహా, రితాబ్రతా బెనర్జీలు తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఇటీవల పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ శోభన్దేవ్ ఛట్టోపాధ్యాయ్ను సమర్ధిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని, దీనిపై విచారణ జరపాలని వారు ఫిర్యాదు చేశారు. సంతకాలు చేసిన ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. టీఎంసీ పార్టీ బెంగాల్ ప్రజలనే కాకుండా, తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా మోసం చేసిందని విమర్శించారు. ఈ అంశంపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు. విచారణలో భాగంగా పార్టీ నేత అభిషేక్ బెనర్జీని సోమవారం విచారించాల్సి ఉంది. అయితే, ఆయన నేటి విచారణకు హాజరు కాలేదు. మరోవైపు తమపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తరచూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో సందీప్ సాహాను, రితబ్రతా బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, వారి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సూచించింది. పార్టీలో ఎలాంటి పదవులు ఉండవని నోటీసులో పేర్కొంది. ఎన్నికల తర్వాత టీఎంసీపై సొంత నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీపై తిరగబడుతున్నారు.