చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 13 ప్రధాన అంశాలను ప్రస్తావించారు. పంజాబ్ ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలని తెలిపారు. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పునరుద్ధరణకు చివరి అవకాశంగా పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగంగా 13 అంశాల ఎజెండాతో పంజాబ్ మోడల్పై చర్చించేందుకు తనకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సోనియాను కోరారు. ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అయితే పార్టీ అంశాలను బహిరంగంగా ప్రస్తావించవద్దని శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు సోనియా హితబోధ చేశారు. పార్టీ అధిష్ఠానంపై బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన 23 మంది సీనియర్ నేతలనుద్దేశించి ఆమె ఈ మేరకు ప్రస్తావించారు. అయితే ఆ మరునాడే సోనియాకు రాసిన లేఖను సిద్ధూ బహిర్గతం చేయడం గమనార్హం.
కాగా, ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ, పంజాబ్ సీఎం చన్నీతో భేటీ అనంతరం మనసు మార్చుకున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ భరోసా ఇచ్చిందని, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను కొనసాగమన్నదని శుక్రవారం తెలిపారు. దీనికి ముందు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు.