Ultimatum | దారుణహత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నెల రోజుల్లోగా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశం విడిచి వెళ్లిపోతానని హెచ్చరించారు. అలాగే, తన కొడుకు హత్యపై నమోదు చేసిన కేసును కూడా విరమించుకుంటానని చెప్పారు. తన కుమారుడి హత్య జరిగి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు తనకు న్యాయం జరుగడం లేదని విచారం వ్యక్తం చేశారు. తనకు చట్టంపై నమ్మకం ఉన్నదని, అందుకనే ఇంతవరకు ఎదురుచూశానే గానీ ఎక్కడా ఎలాంటి ధర్నాలు చేయలేదన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం తనకు కోపం తెప్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తన కొడుకును చంపిన కేసులో ఇన్ని రోజులైనా న్యాయం జరుగకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని బల్కౌర్సింగ్ చెప్పారు. నవంబర్ 25 వ తేదీలోగా తనకు న్యాయం చేకూర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంకా తన కొడుకు హత్యపై విచారణ జరుపాల్సిన అవసరం ఉండదని, ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని ఆయన తెలిపారు. సిద్ధూకు అండగా నిలిచిన వారిని ఎన్ఐఏ విచారణకు పిలువడం పట్ల మూసేవాలా తండ్రి విచారం వ్యక్తం చేశారు. సిద్ధూ మొబైల్ ఫోన్, పిస్టల్, ఇతర వస్తువులు అన్నీ ఎన్ఐఏ వద్ద ఉన్నాయని చెప్పారు. తన కుమారుడికి గ్యాంగ్స్టర్లతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. స్థానిక దినపత్రికల్లో వస్తున్న వార్తలను అబద్ధాలని కొట్టిపారేశారు.