న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. 2019లో మంత్రి పదవిని వీడిన నాటి నుంచి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మండిపడుతున్నారు. కేబినెట్ రీషఫుల్లో సిద్ధూకు విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టలేదు. తాజాగా పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన సిద్ధూ బుధవారం ఉదయం ప్రియాంక గాంధీని కలిశారు. సుమారు నాలుగు గంటలపాటు ఆమెతో చర్చలు జరిపారు. అనంతరం సిద్ధూ సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాగా, సిద్ధూతో సమావేశానికి తనకు ఎలాంటి షెడ్యూల్ లేదని మంగళవారం తెలిపిన రాహుల్ను బుధవారం ఆయన కలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది. దీంతో సిద్ధూకు త్వరలో పార్టీలో కీలక పదవిని కట్టబెట్టవచ్చని తెలుస్తున్నది.