కోర్టు తీర్పును శిరసావహిస్తానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు. మొదట సుప్రీం తీర్పుపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా… నో కామెంట్ అన్నారు. ఆ తర్వాత కోర్టు తీర్పును శిరసా వహిస్తా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం గమనార్హం.
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ సిద్దూకు సుప్రీం ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. 30 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో సుప్రీం ఈ శిక్ష విధించింది. మరి.. సిద్దూ ఈ జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చా? సిద్దూ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది.. క్యూరేటివ్ పిటిషన్. ఈ పిటిషన్ ద్వారా సిద్దూ సుప్రీం తీర్పును సవాల్ చేసే ఛాన్స్ వుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రెండోది.. పోలీసులకు లొంగిపోవడానికి సిద్దూ సుప్రీంను మరింత సమయం కోరవచ్చు. ఈ రెంటిని సుప్రీం పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ వుంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1988 లో జరిగిన రోడ్ రేజ్ కేసులో ఈ శిక్ష పడింది.గుర్నామ్ సింగ్ అనే వ్యక్తికి, సిద్దూకి మధ్య గొడవ జరిగింది. మొదట్లో ఈ గొడవ చిన్నదే అయినా… తర్వాత పెద్దదిగా మారిపోయింది. సిద్దూ గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని లాగి కొట్టారు. దీంతో గుర్నామ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసులో సిద్దూకు కింది కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. బాధిత కుటుంబం పై కోర్టుల్లో అప్పీల్ చేసుకుంది. చివరకు 30 ఏళ్ల క్రితం నాటి కేసులో సుప్రీం కోర్టు నేడు సిద్దూకు యేడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.