Siddu | కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నజజ్యోత్ సింగ్ సిద్దూ మరోమారు తీవ్రంగా మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధాని మోదీ హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉందని, మరి రోడ్డు మార్గంలో ఎందుకు ప్రయాణించారని ప్రశ్నించారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలన్న ప్లాన్ ఏదీ లేదని, అలాంటి సమయంలో రోడ్డు మార్గం ద్వారా ఎందుకు ప్రయాణించారని నిలదీశారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంలో కేంద్ర ఐబీతో సహా కేంద్ర సంస్థల పాత్ర ఏమీ లేదా? అని ప్రశ్నించారు. ప్రధాని పాల్గొనాల్సిన సభలో ప్రజలెవ్వరూ లేరని, అందుకే ప్లాన్ మొత్తాన్ని మార్చేశారని, ఇదంతా ఓ డ్రామా అని తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్ను బద్నాం చేయాలని బీజేపీ వ్యూహం పన్నిందని, ఆ ప్రకారమే నడుచుకుంటున్నారని సిద్దూ ఆరోపించారు.
ప్రధాని మోదీ కేవలం బీజేపీ ప్రధాని మాత్రమే కాదని, దేశం మొత్తానికి ఆయన ప్రధాని అని సిద్దూ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రాణాలకు ముప్పు ఉందంటూ బీజేపీ వారు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలా చేయడం పంజాబీలను కించపరచడమే అవుతుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ డ్రామాలు ఆడుతోందంటూ దుయ్యబట్టారు. ఇక ఈ విషయంపై రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలని సిద్దూ హితవు పలికారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే సరైన విధంగా స్పందించాల్సి వుంటుందని హెచ్చరించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అవన్నీ బీజేపీ చిలుకలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రధాని ప్రాణాలు ఎంత విలువైనవో చిన్న పిల్లలను అడిగినా చెబుతారని సిద్దూ స్పష్టం చేశారు.
మరోవైపు పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి తలెత్తిన భద్రతా లోపంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ కోర్టులో వాదించారు. ప్రధాని భద్రత ఎస్పీజీ పరిధిలోకి వస్తుందని, రాష్ట్రం పరిధిలోకి రాదని వాదించారు. ఇక ప్రభుత్వం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ప్రధానికి భద్రత కల్పించకపోవడం అనేది అరుదైన అంశమని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చిందని అన్నారు. అయితే ప్రధాని పంజాబ్ పర్యటనకు సంబంధించిన ట్రావెల్ రికార్డులను సేకరించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీం ఆదేశించింది. కమిటీ అయినా, కమిషన్ అయినా భద్రతా వైఫల్యం ఏంటన్నది తేల్చాల్సిందేనని సీజేఐ వ్యాఖ్యానించారు.