బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను (Siddaramaiah) పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమచారం. ఉపముఖ్యమంత్రిగా (Deputy Chief Minister ) పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన విస్తృతస్థాయి మంతనాల అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress chief Mallikarjun Kharge) ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. పదవుల పంపకానికి డీకే శివకుమార్ ఒప్పుకున్నట్లు పేర్కొన్నాయి. ఈనేపథ్యంలో మే 20న బెంగళూరులో (Bengaluru) ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర రాజధానిలో సీఎల్పీ (CLP) సమావేశం నిర్వహించనున్నారు. భేటీ అనంతరం సీఎం పేరును ప్రకటించనున్నారు.
ఎన్నికల్లో 135 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే విషయంపై గ్రాండ్ ఓల్డ్ పార్టీలో సందిగ్ధత నెలకొన్నది. ఇదే అంశంపై పార్టీ పెద్దలు చర్చోపచర్చలు నిర్వహించారు. పార్టీలో బలమైన నేతలుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో సీఎం ఎవరిని ఎంపికచేస్తే ఏమవుతుందోననే అనుమానాల నేపథ్యంలో ఇరువురు నేతలో మల్లికర్జున ఖర్గే సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
అయితే అంతకుముందు సీఎం ఎంపికలో హైడ్రామా చోటుచేసుకున్నది. తదుపరి సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్టేనని ప్రమాణస్వీకారానికి బెంగళూరులో కంఠిరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతుండగా, లేదు లేదు.. ఇంకా ఎవరి పేరు ఖరారు కాలేదని బుధవారం సాయంత్రం ఏఐసీసీ నేత సుర్జేవాలా ప్రకటించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది.