CM Siddaramaiah | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కామ్లో కీలకంగా ఉన్న సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు లోకాయుక్త ఉన్నతాధికారి ఒకరు పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. సమన్ల విషయమై సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నించగా.. ‘నేను విచారణకు హాజరవుతా..’ అని ఆయన బదులిచ్చారు. కాగా, ఇదే స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి బీఎంను కూడా గత నెల 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు.
బీజేపీ నేతలు, హక్కుల కార్యకర్తల ఆరోపణల ప్రకారం.. మైసూరు శివారులోని కెసరె గ్రామంలో పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం.. దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్ధరామయ్య కుటుంబానికి 38,283 చదరపు అడుగుల భూమిని (14 సైట్స్ కలిపి) కేటాయించింది. 50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ కేటాయింపు జరిగింది. అయితే, కెసరెలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేత ఆర్ అశోక్ నిలదీశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటు ందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే రూ. 4 వేల కోట్ల విలువజేసే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ముడా భూకుంభకోణంలో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయనే దీనికి అసలు సూత్రధారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ ఆరోపించారు. ఈ స్కామ్ మూలంగా వేల కోట్లు పక్కదారి పట్టాయని ముగ్గురు హక్కుల కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ.. లోకాయుక్త పోలీసులకు, గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ సీఎంపై విచారణకు అనుమతినిచ్చారు.
తనపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సిద్ధరామయ్య పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు జరిపించడం అవసరమని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను బట్టి సీఎం సిద్ధరామయ్యను విచారించి రిపోర్టును డిసెంబర్ 24లోపు సమర్పించాలని ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు పంపించినట్టు తెలుస్తున్నది.