బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలపై ఈ మేరకు నిరసన తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశాలకు సైకిళ్లపై వచ్చి ఇంధన ధరల పెరుగుదలపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు ఢిల్లీ సరిహద్దులో కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైతుల నిరసనలకు దేశంలోని కాంగ్రెస్ లేదా విదేశీ ఏజెంట్లు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సభలో ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతుల నిరసనను అవమానపరిచే విధంగా సీఎం చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ గుండురావు అన్నారు. వారి వద్ద ఏదైనా రుజువు ఉంటే, రైతుల నిరసనలను స్పాన్సర్ చేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ఎల్పీజీ ధర, ఇంధనం ధరల గురించి తాము అడిగితే సీఎం దానికి సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. సీఎం క్లూలెస్ అంటూ దినేష్ గుండు రావు వ్యాఖ్యానించారు.