బెంగళూర్ : మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కర్నాటక మాజీ సీఎం, విపక్ష నేత సిద్ధరామయ్య కోరారు. బాలికల ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని సిద్ధరామయ్య శుక్రవారం ట్వీట్టర్ వేదికగా పోలీసులను కోరారు.
చిత్రదుర్గ మురుగ మఠాధిపతిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని, ఈ విషయంలో పోలీసులు నిష్పాక్షిక విచారణ నిర్వహించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని విపక్ష నేత ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన శివమూర్తి మురుగను శుక్రవారం నాలుగురోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఛాతీనొప్పి వస్తోందని ఫిర్యాదు చేయడంతో శివమూర్తిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగకు ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, లైంగిక వేధింపుల కేసులో శివమూర్తితో పాటు మఠంలోని హాస్టల్ వార్డెన్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మఠం ఆధ్వర్యంలో నడిచే స్కూల్లో చదువుతున్న 15, 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు శివమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠాధిపతి శివమూర్తి తమను మూడేండ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. బాలికల ఫిర్యాదు ఆధారంగా శివమూర్తిని ప్రశ్నించిన అనంతరం మైసూర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.