బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాముడని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హోలాల్కెరే ఆంజనేయ అన్నారు. (Siddaramaiah our Ram ) ‘బీజేపీ రాముడి’ని పూజించడం కోసం అయోధ్యకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. చిత్రదుర్గలో మీడియాతో ఆయన మాట్లాడారు. జనవరి 22న అయోధ్యలో జరుగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి సీఎం సిద్ధరామయ్యకు ఆహ్వానం అందకపోవడం గురించి మీడియా ప్రశ్నించింది. దీంతో ఆంజనేయ వినూత్నంగా సమాధానం ఇచ్చారు. సిద్ధరామయ్యను ఏకంగా రాముడితో పోల్చారు. ‘సిద్ధరామయ్య స్వయంగా రాముడు. అలాంటప్పుడు ఆ రాముడిని (అయోధ్య) గుడిలో పూజించడం ఎందుకు? అది బీజేపీకి చెందిన రాముడు. పబ్లిసిటీ కోసం బీజేపీ ఇదంతా చేస్తోంది. వారు చేయనివ్వండి’ అని కన్నడలో అన్నారు.
కాగా, తమ రాముడు (సిద్ధరామయ్య) తమ హృదయంలో ఉన్నారని కాంగ్రెస్ నేత హోలాల్కెరే ఆంజనేయ అన్నారు. ‘మా రాముడు (సిద్ధరామయ్య) మా హృదయంలో ఉన్నాడు. నా పేరు ఆంజనేయ. ఆయన ఏమి చేసాడో తెలుసుగా?’ అని రాముడికి నమ్మిన బంటు అయిన హనుమంతుడ్ని గుర్తు చేశారు.