న్యూఢిల్లీ : కర్నాటక బీజేపీలో విభేదాలు, నాయకత్వ మార్పుపై ఊహాగానాల మధ్య సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తనతో సమావేశం కావాలని రాహుల్ ఆహ్వానించడంతో ఢిల్లీకి చేరుకున్నానని సిద్ధరామయ్య చెప్పారు. రాహుల్ తనతో ఏయే అంశాలు చర్చిస్తారో తెలియదని, తనతో భేటీకి రాహుల్ చొరవ చూపారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.
సోనియా గాంధీ ఆపాయింట్మెంట్ను కూడా తాను కోరగా ఇంకా ఖరారు కాలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తనకు కర్నాటక పార్టీ చీఫ్ డీకే శివకుమార్తో ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీకేతో కలిసి పార్టీ పటిష్టానికి ఐక్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. బీజేపీ అవినీతి పాలనపై తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు.