AAP | బీజేపీపై ఆమ్ఆద్మీ తీవ్రంగా విరుచుకుపడింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంపి, పాతరేసిందని అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ మేరకు ఆప్ ఓ ట్వీట్ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, అక్కడి కలెక్టర్ చట్ట వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి సరబ్జిత్ కౌర్ను మేయర్గా ప్రకటించారని మండిపడింది. తమ పార్టీకి చెందిన సీనియర్లు కలెక్టర్ ఆఫీసు దగ్గరే వేచి చూస్తున్నా, వారిని కలవడానికి కూడా కలెక్టర్ నిరాకరించారని ఆప్ ఆరోపించింది.
చండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించినా, సరిగ్గా ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు చెందిన ఓ కౌన్సిలర్ బీజేపీకి మద్దతిచ్చారు. అలాగే బీజేపీ ఎంపీని ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో ఓటు కూడా వేశారు. దీంతో ఒక్క ఓటు తేడాతో ఆప్ అభ్యర్థి అంజు కాత్యాల్ ఓటమి పాలై, బీజేపీ అభ్యర్థి సరబ్జిత్ కౌర్ మేయర్గా గెలుపొందారు. బీజేపీ మేయర్ అభ్యర్థికి, ఆప్ అభ్యర్థికి కూడా సమానంగా ఓట్లు పోలయ్యాయి. అయితే ఆప్ అభ్యర్థికి పడ్డ ఓట్లలో ఒక ఓటు చెల్లదని అధికారులు ప్రకటించారు.
డిసెంబర్ 27న చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 35 వార్డులుండగా, 14 వార్గులను ఆమ్ఆద్మీ గెలుచుకొని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8 స్థానాలను, శిరోమణి అకాలీదళ్ ఒక్క స్థానాన్ని గెలుచుకున్నాయి.