భోపాల్ : మధ్యప్రదేశ్లో కాషాయ ప్రభుత్వం తనను పని చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత శోభా ఒజా వెల్లడించారు. వేలాది మహిళలకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు పంపిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు. కమిషన్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని, మహిళల భద్రత, గౌరవం, వారి హక్కులు కాపాడేందుకు తాను ఏమీ చేయలేకపోతున్నానని శోభా ఒజా నిరాసక్తత వ్యక్తం చేశారు.
తాను 2023 మార్చి వరకూ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొనసాగాల్సి ఉన్నా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పదవికి ఉన్న అధికారాలను అన్నింటినీ లాగేసుకుందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను మహిళా కమిషన్ చీఫ్గా వైదొలుగుతూ సీఎం శివరాజ్ చౌహాన్కు రాజీనామా లేఖ పంపానని ఆమె తెలిపారు. ఈ పదవి నుంచి దిగిపోవడంతో తాను గతంలో మాదిరే మహిళా హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా శోభా ఒజాను 2020 మార్చిలో అప్పటి సీఎం కమల్ నాధ్ నియమించారు. ఆపై కొద్దినెలల్లోనే కమల్ నాధ్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒజా నియామకాన్ని కాషాయ ప్రభుత్వం రద్దు చేయగా ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో యథాతథ స్ధితి కొనసాగించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.