ముంబై : సుదీర్ఘ రాజకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం అసెంబ్లీలో మెజారిటీ పరీక్షలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకున్నది. మరో వైపు శివసేన మౌత్ పీస్ ‘సామ్నా’ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తీరుపై విరుచుకుపడింది.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ‘నేను నాలుగుసార్లు ముఖ్యమంత్రిని అయ్యాను. కానీ, గవర్నర్ ఎప్పుడూ పేడ తినిపించలేదు’ అన్నట్లుగా సామ్నా పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వం మారినందుకు బ్రిటిష్ గవర్నర్ లాగే.. భగత్ సింగ్ కోష్యారీ చాలా సంతోషంగా ఉన్నారని విమర్శించింది. విప్లవకారుడు భగత్ సింగ్ను ఉరితీసినప్పుడు బ్రిటీష్ వారు సంతోషించారని.. ఇప్పుడు అలాగే గవర్నర్ కూడా సంతోషిస్తున్నారని మండిపడింది.
ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిన సమయంలో గవర్నర్ సంతోషంగా లేదరంటూ ఆరోపించింది. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కలిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలకు గవర్నర్ స్వీట్లు తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.