మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని ఆయన బాబాయ్, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. పార్టీకి ప్రస్తుతం ‘నేతాజీ’ అఖిలేశే అని కుండబద్దలు కొట్టారు. అయితే ఇరు పక్షాల మధ్య సీట్ల ఒప్పందం మాత్రం ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలే వుండవని, గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు దక్కుతాయని శివపాల్ ప్రకటించారు.
2018 లో అఖిలేశ్ యాదవ్తో విభేదించి, శివపాల్ యాదవ్ కొత్త పార్టీని స్థాపించారు. దాని పేరు ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ. పార్టీ మార్గదర్శకుడు ములాయం సింగ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో శివపాల్ పార్టీలో చక్రం తిప్పారు. అఖిలేశ్ చేతికి వ్యవహారం వచ్చేసరికి ఆయనతో పొసగలేదు. చివరికి పార్టీని వీడి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అఖిలేశ్, శివపాల్ మధ్య దూరం అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే మొన్నటికి మొన్న అఖిలేశ్ యాదవే ఓ మెట్టు దిగి, బాబాయ్ శివపాల్ ఇంటికి వెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. శివపాల్ తన పార్టీని సమాజ్వాదీలో కలిపేసేందుకు అంగీకరించారు.