ఆరు నెలల ముందే అభ్యర్థుకు టిక్కెట్లు ఇచ్చి వుంటే.. సమాజ్వాదీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేదని సమాజ్వాదీ నేత, అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించడం అత్యావశ్యకమని, అయితే సమాజ్వాదీ అత్యంత పటిష్ఠంగా, బలంగా బీజేపీని ఎదుర్కొంటూ, ఎన్నికల్లోకి దిగితేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అత్యంత చాకచక్యంగా, మోసపూరితంగా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. అయితే ప్రజలిచ్చిన తీర్పును మాత్రం తాము గౌరవిస్తున్నామని శివపాల్ స్పష్టం చేశారు.
చివరి దశలో పోలింగ్ బూత్లో అవకతవకలు జరిగాయని, పోలీసులు కూడా సహకరించారని శివపాల్ ఆరోపించారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం తమకే అత్యధిక ఓట్లు వచ్చాయని అన్నారు. ఇకపై సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా.. వాటిని సమర్థవంతంగా చేస్తానని ప్రకటించారు. పార్టీ బాధ్యతలు అయినా, ఇంకే బాధ్యతలైనా నిర్వర్తిస్తానని శివపాల్ హామీ ఇచ్చారు.