బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka polls) రసవత్తర పోరుకు తెరలేచింది. రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కిచ్చా సుదీప్ నటించిన సినిమాలను మే 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ రాష్ట్రంలో ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని శివమొగ్గకు చెందిన ఓ న్యాయవాది రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.
సుదీప్ సినిమాలు, షోలు నేరుగా ఓటర్లపై ప్రభావం చూపుతాయని శివమొగ్గ న్యాయవాది కేపీ శ్రీపాల్ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కిచ్చా సుదీప్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాషాయ పార్టీ తరపున ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కళ్యాణ కర్నాటక ప్రాంతంలో ప్రధానంగా సుదీప్ ప్రచారం సాగనుందని సమాచారం. ఓటమి భయంతోనే బీజేపీ సినీ నటులను ప్రచారానికి రప్పిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
బీజేపీ నేతల ప్రసంగాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో జనం దృష్టిని ఆకట్టుకునేందుకు కాషాయ నేతలు సినీ నటుల కోసం అర్రులుచాస్తున్నారని, ఇది బీజేపీ దివాళాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గురువారం 42 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ నుంచి హస్తం గూటికి చేరిన బాబూరావు చిచన్సూర్, ఎన్వై గోపాలకృష్ణలకు చోటు దక్కింది.
బాబూరావు గుర్మిత్కల్ సీటు నుంచి బరిలో దిగనుండగా, గోపాలకృష్ణ మొల్కల్మూర్ నుంచి పోటీ చేయనున్నారు. బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని పాలక బీజేపీ సర్కార్పై అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అభ్యర్ధుల ఎంపికను ఆచితూచి చేపట్టడంతో పాటు ముఖ్యనేతల మధ్య సమన్వయంతో ముందుకెళుతోంది. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More