శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్తమయితే శ్రీలంక, ఉక్రెయిన్లో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు తలెత్తాయో, అలాంటి పరిస్థితులే భారత్లో కూడా ఎదురవుతాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా హెచ్చరించారు. పెద్ద పెద్ద సిటీల్లో ఇలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తడం దురదృష్టకరం. దేశ రాజధానిలోనూ అల్లర్లు చెలరేగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి అంటూ రౌత్ తీవ్రంగా హెచ్చరించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ ఇలా చేస్తోందని రౌత్ ఆరోపించారు. మొదట్లో ఎన్నికలను వాయిదా వేయించారని, ఇప్పుడు అల్లర్లని, ఆయన గుర్తు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికే ఇలా చేస్తున్నారని, బీజేపీ వారికి ఇతర సమస్యలు లేవని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బీజేపీకి అధికారం లేకే.. లౌడ్ స్పీకర్ల అంశాన్ని లేవదీస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద నగరాలు కూడా ఇందుకు ప్రభావితమవుతున్నాయని, పనులకు వెళ్లే వారికి తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆక్షేపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం శ్రీలంక, ఉక్రెయిన్ కంటే అత్యధికంగా నష్టపోతామని శివసేన ఎంపీ రౌత్ హెచ్చరించారు.