Shiva sena | శివసేన హఠాత్తుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను డబ్బుతో కొనాలని ప్రయత్నాలు చేస్తోందని సామ్నా వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ ఇలా చేయడం సరికాదని, ఇలా చేయడం వల్ల బీజేపీ లాభపడుతుందని శివసేన అభిప్రాయపడింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేయాలని మమత నిర్ణయం తీసుకోవడం రాజకీయపరంగా తప్పుడు నిర్ణయమని, కాంగ్రెస్ను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోందని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పడం సరైన విధానం కాదని శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. గోవా వేదికగా సీఎం మమత చేస్తున్న రాజకీయాలు చిట్టచివరికి బీజేపీకే లాభం చేకూరుస్తాయని పేర్కొంది.
గోవాలో కాంగ్రెస్కు సరైన నాయకత్వమే లేదని, అందుకే క్రమంగా బలం తగ్గుతూ వస్తోందని శివసేన పేర్కొంది. అసలు ఢిల్లీ రాజకీయాల్లో గోవా రాజకీయం అంతగా క్రియాశీలకంగా ఎన్నడూ లేదని, ఆప్, తృణమూల్ ఇప్పుడు గోవా సంక్షేమం గురించి తెగ మాట్లాడుతున్నారని దుయ్యబట్టింది. ఇరు పార్టీలూ క్రిస్టియన్ ఓట్లపై కన్నేశాయని, కానీ క్రిస్టియన్లు ఎప్పుడూ కాంగ్రెస్ పంచనే ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ మీద కోపంతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారని, అక్కడ టిక్కట్లు రావని తెలిసి, తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ అలాంటి వారిని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు శివసేన తన సంపాదకీయంలో వెల్లడించింది.
రాష్ట్రంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ అటు అధికారాన్ని, ఇటు డబ్బును దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. దాదాపు 10 సంవత్సరాల పాటు బీజేపీ గోవాను ఏలిందని, కానీ అధికారం కోసం కావాల్సిన మెజారిటీని ఎప్పుడూ సంపాదించుకోలేకపోయిందని, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని శివసేన విరుచుకుపడింది. గోవాలో తృణమూల్ మరీ యాక్టివ్ అయిపోయిందని, అది బీజేపీకే లాభమని శివసేన పేర్కొంది.