పనాజీ: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఉన్నది. ఎవరి ప్రయోజనాల కోసం వారు పొత్తులు కడుతుంటారు. బలం ఉందనుకుంటే విడిపోయి వైరి పక్షాలుగా మారుతారు. ప్రస్తుతం గోవాలో ఇదే జరుగుతున్నది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని సీఎం పీఠానికి దూరం చేయడానికి మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇదే సూత్రాన్ని గోవాలో కూడా అనుసరించడానికి కాంగ్రెస్ ససేమిరా అంటున్నది. తాము ఒంటరిగా బరిలోకి దిగడానికి సన్నద్ధమవుతున్నది.
గోవాలో కలిసి పోటీ చేయడానికి కాంగ్రెస్తో చర్చలు జరిపామని, అయితే అటు నుంచి ఎలాంటి సమాధానం లేదని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆ పార్టీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. మహారాష్ట్రలో లాగా గోవాలో కూడా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి మహా వికాస్ అఘాడి కూటమిని ఏర్పాటు చేద్దామనుకున్నామని, అయితే తమ సొంతగానే మెజారిటీ సీట్లను గెలుపొందుతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సంజయ్ రౌత్ వెల్లడించారు.
కాగా, గోవా అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన కలిసి పోటీచేస్తాయని చెప్పారు. ఈసారి గోవాలో తమ పార్టీ తప్పనిసరిగా కొన్ని స్థానాల్లో గెలుపొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.