ముంబై : శివసేన కార్యకర్తలు సోమవారం ముంబై ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డులను ధ్వంసం చేసి వాటిని తొలగించారు. ముంబై ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలను గౌతం అదానీ గ్రూప్ చేపట్టిన అనంతరం బోర్డుపై అదానీ పేరును చేర్చడంతో సేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. అదానీ గ్రూపు పేరిట ముంబై ఎయిర్పోర్టు పేరు మార్చడాన్ని మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్లో భాగస్వామ్య పక్షమైన శివసేన వ్యతిరేకిస్తోంది.
చత్రపతి శివాజీ మహరాజ్ ఎయిర్పోర్టు పేరును మార్చే హక్కు అదానీ గ్రూప్కు లేదని శివసేన స్పష్టం చేసింది. గతంలో ఎయిర్పోర్టను జీవీకే నిర్వహించిన సమయంలోనూ బ్రాండింగ్ కొనసాగింది. ఎయిర్పోర్ట్కు అదానీ పేరు పెట్టడంపై తమకు పలు ఫిర్యాదులు అందాయని, అందుకే వాటిని తొలగించామని శివసేన పేర్కొంది. ఈ ఏడాది జులై 13న ముంబై ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీవీకే నుంచి అదాని గ్రూప్ చేపట్టడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో అదానీ ఎయిర్పోర్ట్ పేరిట బోర్డులు వెలిశాయి.