మహారాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల నిరసనలు
ఎమ్మెల్యేలు, శ్రీకాంత్ షిండే కార్యాలయాలు ధ్వంసం
బాలాసాహెబ్ పేరును ఇతరులు వాడొద్దు: ఉద్ధవ్
తిరుగుబాటు ఎమ్మెల్యేల ద్రోహాన్ని మర్చిపోం: ఆదిత్య
మాది శివసేన (బాలాసాహెబ్) వర్గం: రెబల్ ఎమ్మెల్యేలు
ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నేతలతో ఏక్నాథ్షిండే చర్చలు!
ముంబై, జూన్ 25: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు సోమవారం నిరసనలకు దిగారు. రెబల్ ఎమ్మెల్యేలు తనాజీ సావంత్, ధ్యాన్ చౌగులే, ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కార్యాలయాలను ధ్వంసం చేశారు. బ్యానర్లను చించివేశారు. ఆందోళనల నేపథ్యంలో థాణె, ముంబైలలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. శ్రీకాంత్ షిండే కార్యాలయంపై రాళ్లదాడిలో ఐదుగురు శివసేన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇదిలా ఉంగా, తనతో సహా 38 మంది ఎమ్మెల్యేల ఇంటి భద్రతను ఉద్ధవ్ ప్రభుత్వం ఉపసంహరించుకొన్నదని ఏక్నాథ్ ఆరోపించారు. దీన్ని ఖండించిన హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, తమకు ఆ ఆలోచన లేదన్నారు. శివసేనలో ప్రస్తుత సంక్షోభం నిజానికి, అబద్ధానికి మధ్య యుద్ధం అని ఆదిత్య ఠాక్రే అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లో మంత్రులు 24 గంటల్లో వాళ్ల పదవులు కోల్పోతారని సంజయ్ రౌత్ హెచ్చరించారు.
మీ తండ్రి పేరుతో ఓట్లడగండి..
రెబల్స్పై చర్యలు తీసుకొనేందుకు ఉద్ధవ్కు అధికారం ఇస్తూ శివసేన జాతీయ కార్యవర్గం శనివారం తీర్మానించింది. అయితే, వారిపై వెంటనే చర్యలు తీసుకోకూడదని, వేచి చూడాలని నిర్ణయించింది. ఏ రాజకీయ వర్గం కూడా శివసేన పేరు, బాల్ ఠాక్రే పేరును ఉపయోగించుకోవద్దని మరో తీర్మానం చేసింది. ‘ఓట్లు అడిగేవారు మీ తండ్రి పేరిట ఓట్లడగండి కానీ బాల్ ఠాక్రే పేరు వాడొద్దు’ అని ఉద్ధవ్ ఠాక్రే రెబల్స్కు స్పష్టం చేసినట్టు రౌత్ పేర్కొన్నారు. కాగా, ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.
ఉద్ధవ్కు చెప్పాం
తాము శివసేనను వీడలేదని ఏక్నాథ్ షిండే వర్గం ప్రకటించింది. పార్టీలో ప్రత్యేక బృందంగా ఉంటామని, శివసేన(బాలాసాహెబ్) పేరు కింద కొనసాగుతామని పేర్కొన్నది. రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ వర్చువల్గా విలేకరులతో మాట్లాడారు. ‘మేం శివసేన పార్టీలోనే ఉంటాం. ఈ విషయాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధ్యక్షుడు ఉద్ధవ్కు చెప్పారు. ప్రజలు మమ్మల్ని ఆ పార్టీ నుంచే ఎన్నుకొన్నారు. వారి నిర్ణయానికి విలువ ఇవ్వాలి’ అని అన్నారు. శివసేన(బాలాసాహెబ్) అధ్యక్షుడిగా ఏక్నాథ్ షిండేను గుర్తించినట్టు తెలిపారు. షిండే వర్గం ఉద్ధవ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొంటుందా అన్ని ప్రశ్నించగా.. ‘మేం ఎందుకు ఉపసంహరించుకోవాలి. మేం శివసేనలో ఉన్నాం. పార్టీని హైజాక్ చేయలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్ హైజాక్ చేశాయి’ అని బదులిచ్చారు.
కోర్టుకు వెళ్తాం
శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని అసెంబ్లీలో కూడా నిరూపించుకోగలమని కేస్కర్ అన్నారు. అయితే, శివసేనను ఏ రాజకీయపార్టీలోనూ కలుపబోమన్నారు. ‘55 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో కేవలం 16 మంది మాత్రమే శాసనసభా పక్ష నేతను ఎలా మారుస్తారు? షిండేను ఆ స్థానం నుంచి ఎలా తొలగిస్తారు? దీనిపై మేం కోర్టుకు వెళ్తాం’ అని చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ ఉద్ధవ్కు వ్యతిరేకం కాదని, ఎన్సీపీ, కాంగ్రెస్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఉద్ధవ్ ఇప్పటికైనా ఎంవీఏ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలవాలని పునరుద్ఘాటించారు.
హోటల్ బిల్లులు ఎవరు కడుతున్నారు?
శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న గువాహటి, సూరత్లోని హోటళ్లకు బిల్లులు ఎవరు కడుతున్నారని ఎన్సీపీ ప్రశ్నించింది. దీనిపై నిగ్గు తేల్చాలని ఐటీ, ఈడీని డిమాండ్ చేసింది. ‘సూరత్, గువాహటిలోని హోటళ్లకు బిల్లులను ఎవరు కడుతున్నారు? చార్టర్డ్ ఫ్లైట్లకు డబ్బులెవరు ఇస్తున్నారు.? ఎమ్మెల్యేల బేరం విలువ రూ.50 కోట్లు నిజమేనా?’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తాపసీ ప్రశ్నించారు.
ఫడ్నవీస్తో షిండే రహస్య చర్చలు
ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్షిండే శుక్రవారం రాత్రి గుజరాత్లోని వడోదరలో రహస్యంగా చర్చించినట్టు సమాచారం. షిండే ప్రత్యేక ఫ్లైట్లో గువాహటి నుంచి వడోదర వచ్చినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి అమిత్షా కూడా వడోదరలోనే ఉన్నారు.