ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే అధికార పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతుండటం యోగీ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది. ఇక బహుజన్ సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో ఎన్నికల్లో పోటీకి సమాయత్తమయ్యాయి.
ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో తాము కూడా బరిలో దిగబోతున్నామని ఆయన చెప్పారు. దీనిపై స్థానిక నాయకులతో చర్చించేందుకు రేపు పశ్చిమ యూపీకి వెళ్తున్నానని రౌత్ వెల్లడించారు.
కాగా, రౌత్ వ్యాఖ్యలను నెటిజన్లు ట్విట్టర్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత సీఎం అయ్యేది శివసేన అభ్యర్థేనేమో అని కొందరు ఎగతాళి చేశారు. శివసేన ఒక్క స్థానంలో నోటాను ఓడించినా సంబురాలు చేసుకుంటుందని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. అభ్యర్థుల డిపాజిట్ల రూపంలో ఈసీకి ఇక డబ్బులే డబ్బులు అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.