ముంబై/నాగ్పూర్, మే 26: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారని ఆరోపించారు. గడ్కరీ మూడోసారి నాగ్పూర్ నుంచి బరిలోకి దిగారు. గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని భావించిన ఫడ్నవీస్.. అయిష్టంగానే ప్రచారంలో పాల్గొన్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
గడ్కరీని ఓడించేందుకు ఫడ్నవీస్ ప్రతిపక్షానికి సహకరించారని నాగ్పూర్లోని ఆరెస్సెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారని పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన వ్యాసంలో రౌత్ చెప్పుకొచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన వర్గం.. ప్రతి నియోజకవర్గంలో 25-30 కోట్ల చొప్పున పంపిణీ చేసిందని సంజయ్ రౌత్ ఆరోపించారు.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే ఖండించారు. ఆయన భ్రమలు పడుతున్నారని, బీజేపీ అంటే ఒక పార్టీ కాదని, ఒక కుటుంబం అని అన్నారు. రౌత్ వ్యాఖ్యలపై నాగ్పుర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వికాస్ థారే స్పందించారు. నాగ్పుర్లో గడ్కరీ గెలుస్తారన్న రౌత్ వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.