ముంబై : మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ను కాపాడే క్రమంలో మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో తాను మాట్లాడాననే వార్తలను మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తోసిపుచ్చారు. ఠాక్రే, ఫడ్నవీస్ల మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదని ఈ దిశగా సాగిన ప్రచారం తప్పుదారి పట్టించేందుకేనని శివసేన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఫడ్నవీస్తో ఎంవీఏ సర్కార్ను కాపాడే ఉద్దేశంతో ఠాక్రే చర్చలు జరిపారనే వార్తలు నిరాధారమని స్పష్టం చేసింది. ఠాక్రే ఏమైనా చెప్పదలుచుకుంటే బాహాటంగా చెబుతారని దాపరికం ఉండదని సేన పేర్కొంది. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నామని, వేచిచూసే ధోరణితో ముందుకెళతామని చెప్పుకొచ్చిన కాషాయ పార్టీ అనూహ్యంగా రెబెల్ గ్రూప్తో కలిసి సర్కార్ ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేందుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో చర్చలు జరిపిన ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోనూ భేటీ కానున్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు త్వరలో ముంబై చేరుకుని మహారాష్ట్ర గవర్నర్ను కలుస్తారని రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే సంకేతాలు పంపారు.