ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్పై తిరుగుబాటు చేసి శివసేనను నిట్టనిలువునా చీల్చిన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే గువహటి నుంచే పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. గురువారం ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వ బల నిరూపణకు గవర్నర్ భగత్ సింగ్ కోశియారీ ఆదేశించడంతో నేరుగా అసెంబ్లీకి రెబెల్ ఎమ్మెల్యేలతో చేరుకునేలా ఏక్నాథ్ షిండే ప్లాన్ చేశారు.
ఎమ్మెల్యేలు ముంబై చేరగానే ఉద్ధవ్ క్యాంప్లోకి వెళ్లకుండా ఆయన చివరినిమిషం వరకూ వారిని మహారాష్ట్ర వెలుపల ఉండేలా స్కెచ్ వేశారు. గురువారం ఉదయం ముంబైలో అడుగుపెడతామని షిండే ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక గత వారం రోజులుగా బీజేపీ పాలిత అసోం రాజధాని గువహటిలోని హోటల్లో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం స్పైస్జెట్ విమానంలో గోవాకు తరలివెళతారు.
ఆపై గురువారం ఉదయం గోవా నుంచి ముంబైకి వెళ్లేలా రెబెల్ నేత షిండే ప్లాన్ చేశారు. మరోవైపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ సర్కార్ బల పరీక్ష నేపధ్యంలో కాషాయ పార్టీ అప్రమత్తమైంది. తాజ్ ప్రెసిడెంట్ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలతో బుధవారం సాయంత్రం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ కానున్నారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరేలా దేవేంద్ర ఫడ్నవీస్ పావులు కదుపుతున్నారు.