ముంబై: బీజేపీ చేపడుతున్న జన్ ఆశీర్వాద్ యాత్రకు రాష్ట్రంలో భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్ట్ చేయించిందని కేంద్రమంత్రి నారాయణ్ రాణే చెప్పారు. ఆ పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని రాణే ఆరోపించారు. జన్ ఆశీర్వాద్ యాత్ర పదో రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ.. ‘జన్ ఆశీర్వాద్ యాత్రలో ఒక చెడ్డ శకునం. తమను తాము రాష్ట్రపతిగా ఊహించుకొనే కొందరు మంత్రులు నన్ను అరెస్టు చేయించారు. నా యాత్రను ఆపాలనుకున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ శివసేన వారికి అధికారాలు కట్టబెడుతోంది’ అన్నారు.
‘నా యాత్రను కొనసాగిస్తా. మహారాష్ట్రలోని ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తా. కేంద్రం అందించే పథకాలను ప్రజలకు వివరిస్తా. భాజపాలో చేరాలనుకునే వారిని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా’ అని మంత్రి రాణే పేర్కొన్నారు. ‘దేశ ప్రధాని ఆలోచన నుంచి పుట్టిందే జన్ ఆశీర్వాద్ యాత్ర. ఆయన నాకు కేబినేట్ పదవిని ఇచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకోమన్నారు. ముంబై నుంచి చేపట్టిన యాత్ర పదో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సింధుదుర్గ్లో ఉన్నా. ఇప్పటికీ కొంతమంది ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినా కొన్ని వేల మంది జనం నాతో కలిసి వస్తున్నారు’ అని రాణే పేర్కొన్నారు.