ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యవస్ధాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును రెబెల్ నేత ఏక్నాథ్ షిండే సహా రెబెల్ ఎమ్మెల్యేలు వాడరాదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానం ఆమోదించింది.
పార్టీలో తిరుగుబాటును ఎదుర్కొంటున్న శివసేన తమ పార్టీ వ్యవస్ధాపకుడు బాల్ ఠాక్రే పేరును, పార్టీ పేరును ఏ ఇతర వర్గం వాడకుండా చూడాలని కోరుతూ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించేందుకు సిద్ధమైంది. మరోవైపు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు తమ గ్రూపునకు శివసేన బాలాసాహెబ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. షిండే తిరుగుబాటు నేపధ్యంలో పార్టీని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అధికారాన్ని శివసేన జాతీయ కార్యవర్గం ఉద్ధవ్ ఠాక్రేకు కట్టబెట్టింది.
16 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని శివసేన ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వల్ శనివారం నోటీసులు జారీ చేశారు. జూన్ 27లోగా రెబెల్ ఎమ్మెల్యేలు తమ వాదనలకు మద్దతుగా అవసరమైన పత్రాలతో నోటీసులకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.