Sanjay Raut | పత్రాచాల్ భూ కుంభకోణంలో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 8 వరకు పొడిగించింది. కస్టడీ ఇవాళ్టితో ముగియనుండగా.. ఈడీ ఆయనను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా.. కస్టడీని పొగించింది. ఈడీ కస్టడీ పొడిగింపుపై సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ స్పందిస్తూ.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు.
సంజయ్ రౌత్ బాలా సాహేబ్ ఠాక్రే నిజమైన శివసైనికుడని, ఆయన ఎప్పుడూ అవినీతికి పాల్పడరని స్పష్టం చేశారు. ఆయనకు బీజేపీ భయపడుతోందని ఆరోపించారు. సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ఆదివారం అర్ధరాత్రి ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.