ముంబై : మహారాష్ట్ర సంక్షోభం సమసినా వాటి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గువహటిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాలని తనకూ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడని చెబుతూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మవిశ్వాసంతో విచారణకు హాజరయ్యానని రౌత్ పేర్కొన్నారు.
నిజం మనవైపున ఉంటే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏక్నాథ్ షిండే శివసేన సీఎం కాదని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంగా చెప్పారని అన్నారు. ముంబైలో శివసేన ఉనికిని తగ్గించేందుకే తమ పార్టీని దెబ్బతీయాలని కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగా ఇదంతా జరిగిందని షిండే తిరుగుబాటును ఉద్దేశించి రౌత్ అన్నారు. శుక్రవారం జరిగిన శివసేన ఎంపీల సమావేశానికి 18 మంది ఎంపీలకు గాను 15 మంది హాజరయ్యారని చెప్పారు.
నిజమైన శివసైనికులు ఎవరూ ప్రలోభాలకు లోనుకారని, ఉద్ధవ్ ఠాక్రేదే నిజమైన శివసేనని స్పష్టం చేశారు. ఇక బీజేపీ వ్యూహంలో భాగంగానే శివసేనను చీల్చే ప్రయత్నం చేస్తోందని సేన ప్రతినిధి ఆరోపించారు. మహారాష్ట్ర సంక్షోభానికి తెరదించుతూ రాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్లు గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.