ముంబై : బహిరంగ సమావేశాల్లో మాస్క్ లేకుండా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీని తాను అనుసరిస్తున్నానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. నాసిక్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాస్క్ ధరించకపోవడంపై వివరణ ఇస్తూ ఈ విషయంలో తాను మోదీని ఫాలో అవుతున్నానని అన్నారు. మాస్క్లు ధరించాలని ప్రజలకు సూచిస్తున్న ప్రధాని మోదీ ఆయన మాత్రం మాస్క్ పెట్టుకోవడం లేదని రౌత్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాస్క్ ధరిస్తున్నారని..దేశానికి నాయకుడైన మోదీ మాత్రం మాస్క్ను పక్కనపెడుతున్నారని అన్నారు. అందుకే తాను మోదీని అనుసరిస్తూ తాను కూడా మాస్క్ ధరించడం లేదని చివరికి ప్రజలు కూడా మాస్క్లు ధరించడం లేదని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తి నేపధ్యంలో బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారు జాగ్రత్తలు పాటించాలని సంజయ్ రౌత్ కోరారు.
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు ఆమె భర్త సదానంద్ సూలే, ప్రజక్త్ తన్పురే (మహారాష్ట్ర మంత్రి), వర్ష గైక్వాడ్ వంటి నేతలు కరోనా బారినపడ్డారని బహిరంగ సమావేశాలకు హాజరయ్యే వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.