ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన మహా వికాస్ అఘది (ఎంవీఏ) సర్కార్ను కూల్చేందుకు కొందరు కాషాయ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని సేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సర్కార్ను అస్ధిరపరిచే లక్ష్యంతో కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
బీజేపీ తనపై ఈడీని పురిగొల్పిందని, తనపై అభియోగాలు మోపే ఉద్దేశంతో తన చుట్టూ ఉన్న వారినీ కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని రౌత్ ఆరోపించారు. బీజేపీ నేత కిరిట్ సోమయ్య విలేకరుల సమావేశంలో కూర్చుని ఈడీ దాడులపై లైవ్ అప్డేట్స్ ఇచ్చారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తాను లేఖ రాసిన తర్వాతే ఈ తతంగం నడిచిందని దుయ్యబట్టారు. శివసేన నేతలు, ఠాక్రేలపై దర్యాప్తు ఏజెన్సీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని రౌత్ పేర్కొన్నారు.
అలీబాగ్లో ఠాక్రే కుటుంబం 19 బంగ్లాలు నిర్మిస్తోందని ఆరోపిస్తున్నారని, తాను జర్నలిస్టులందరినీ ఆ బంగ్లాలకు విహార యాత్రకు తీసుకువెళతానని, అక్కడ ఆ బంగ్లాలు కనిపించకపోతే ఆరోపణలు చేసిన వారికి వారి స్ధానమేంటో చూపాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలతో శివసేన నేతలపై ఒత్తిడి చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ నేతలు తమపై ఢిల్లీకి లేదా జో బైడెన్ వద్దకు ఫిర్యాదులతో వెళ్లినా తాము భయపడబోమని ఆయన స్పష్టం చేశారు.