న్యూఢిల్లీ : మహాత్మా గాంధీపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ కృపాల్ తుమనె తప్పుపట్టారు. గాంధీజికి అధికార వ్యామోహం ఉంటే అప్పట్లో ప్రధాని, రాష్ట్రపతి సహా కీలక పదవులను చేపట్టేవారని అన్నారు. కంగనా రనౌత్కు పద్మశ్రీ ఎలా వచ్చిందో ఢిల్లీలో ఉండే ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలుసునని ఎద్దేవా చేశారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని సేన ఎంపీ ప్రశ్నించారు. కాగా కంగనా వ్యాఖ్యలను పలువురు శివసేన నేతలు ఖండించారు.
మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, నిరాధారమైనవని అన్నారు. బాలీవుడ్ నటిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కితీసుకోవాలని శివసేన నేత నీలం గోర్హె డిమాండ్ చేశారు. ఆప్ నేత ప్రీతి శర్మ, మహారాష్ట్ర మంత్రి విజయ్ వడెట్టివార్, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సహా పలువురు నేతలు కంగనా వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసే హక్కు కంగనాకు లేదని ఆక్షేపించారు. భగత్ సింగ్, నేతాజీలను గాంధీ ఎన్నడూ సమర్ధించలేదని కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారత్కు 1947లో స్వాతంత్ర్యం రాలేదని, 2014లో స్వాతంత్ర్యం లభించిందని అంతకుముందు బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలు సైతం కలకలం రేపాయి.