న్యూఢిల్లీ : బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు క్రూర ఏనుగుల్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ, చట్ట, రాజకీయ వ్యవస్ధలను అణగదొక్కుతున్నారని శివసేన గురువారం ఆరోపించింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా కేంద్రం అస్ధిరపరుస్తోందని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారి పేరు ప్రస్తావించకుండా శివసేన పేర్కొంది.
పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో కాషాయ పార్టీ తీరును శివసేన ఎండగట్టింది. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన సంకీర్ణ సర్కార్ గవర్నర్ భగత్సింగ్ కోష్యారి మధ్య సంబంధాలు బెడిసికొడుతున్న క్రమంలో సేన ఈ ఆరోపణలు గుప్పించింది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన 12 మంది ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంలో జాప్యం నెలకొనడం పట్ల కోష్యారి తీరుపై సేన సర్కార్ మండిపడుతోంది. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్ధిరపరిచే కేంద్రం తీరు దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని సామ్నా సంపాదకీయంలో శివసేన రాసుకొచ్చింది.