ముంబై : పనికిమాలిన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యుడికి సంబంధించిన అంశాలను చర్చకు రానీయడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. లౌడ్ స్పీకర్ల వ్యవహారం కూడా ఓ అంశమేనా అని ఎద్దేవా చేశారు.
హనుమాన్ జయంతి మన సంస్కృతిలో భాగమని, దీన్ని అందరం కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈసారి హనుమాన్ జయంతి చుట్టూ భిన్నమైన వాతావరణాన్ని సృష్టించారని చెప్పారు. సామాన్యుడిని వేధిస్తున్న ధరల పెరుగుదల అంశాన్ని చర్చించడం లేదని, దేశంలో విధ్వంసాన్ని, రక్తపాతాన్ని సృష్టించే అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని శివసేన నేత ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల తరహాలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతో శివసేన అధికార దాహంతో వ్యవహరించదని స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కుంభకోణంలో బీజేపీ నేత కిరిట్ సోమయ పాత్రపై త్వరలో ఆధారాలు బయటపెడతామని చెప్పారు.